బ్రహ్మ శ్రీ జగద్గురు వేదాంతంలక్ష్మణార్యుల స్వామి వారి గురుపరంపర


శ్రీ మన్నారాయణ యతీశ్వరులు (1800 - 1870)

దివ్యమైన హిమాలయ పర్వతము పవిత్రభారతావనికి పెట్టనికోట. ఎందరో యతీశ్వరులకు, ఋషి పుంగవులకు, మహాత్ములకు నిలయము. అటువంటి హిమాలయములనుండి వచ్చినటువంటి సాక్ష్యాత్ శ్రీమన్నారాయణ స్వరూపులైన నారాయణ యతీశ్వరులు సుమారు 18౩౦ ప్రాంతములో దక్షిణ భారతదేశంలో సంచరించుచు గద్వాల్ నగరమునందలి ఆధ్యాత్మిక శాస్త్రకోవిధులు సద్సద్వివేచాపరులు సదాచార నిష్టులు అయిన శ్రీ శ్రీనివాసాఖ్యుల వారికి మంత్రోపదేశమొనరించిరి.


శ్రీ శ్రీనివాసాఖ్య సద్గురువులు (1810 - 1890)

గద్వాల్ ఆస్థానపండితులైన శ్రీ శ్రీనివాసాఖ్య సద్గురువులు ఎంతోమంది జిజ్ఞ్యాసువులకు జ్ఞానభోద చేస్తూ ఒక పండిత సభలో కలిసిన లక్ష్మణయోగి అను విప్రోత్తముని గాంచి కడు సంతసించి వారికి గురుదీక్షనోసంగిరి.


శ్రీ లక్ష్మణ యోగీశ్వరులు (1830 - 1910)

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లా చెల్లకెరె తాలూకా, సిరివాళం గ్రామస్థులైన శ్రీ లక్ష్మణయోగి ఆజన్మ బ్రహ్మచారులు. దివ్యమైన తేజస్సుతో బ్రహ్మ వర్చస్సుతోప్రకాశించే వేదవేదా౦గ పారంగతులు. తెలుగు, కన్నడ, సంస్కృత భాషలలో పండితులు. వీరు గద్వాల్ సంస్థానంలో పండిత సన్మానం అని తెలిసి, వెళ్ళి శ్రీనివాసాఖ్య సద్గురువుల దర్శన భాగ్యంచే తరించి వారి ఆదేశానుసారం బళ్ళారి, రాయదుర్గం ప్రాంతములలో సంచరిస్తూ భక్తులకు బ్రహ్మానందానుభూతిని కలిగించిరి. శ్రీవారు పాల్గుణ శుద్ద దశమినాడు శ్రిరివాలం గ్రామంలో జీవ సమాధిని పొందినారు. వారి యొక్క దివ్యసమాధి శిరివాళం గ్రామంలోనున్న పొలంలో దిగుడుబావి ప్రక్కన బిల్వవృక్షం నీడలో వున్నది.


శ్రీ యాడాటి నరహరి సద్గురు స్వాములు (1850 - 1929)

రాయదుర్గం నివాసి అయిన తేజోమూర్తులు బ్రహ్మవిద్య పారంగతులు అయిన శ్రీ యాదాటి నరహరి శాస్త్రిగారు, సంస్కృత ఆంధ్రభాషలలో చక్కగా అభ్యసించి, వేదాధ్యయనము గావించిరి. వారి యొక్కవాక్పటిమ మరియు, సంగీత సాహిత్య ప్రావీణ్యత అద్భుతంగా అందరిని ఆకర్షించి ఆకట్టుకునేవి. ఆద్యాత్మిక విద్యా వేత్తలు అంతరార్థ ప్రభోదకులు అయిన శ్రీవారు ఒకసారి శివరాత్రి సందర్భంగ వేదాంతం లక్ష్మణార్యులను చూసి వారిలో వున్న జిజ్ఞాసను గుర్తించి వారిని తన శిష్యులుగా చేసుకొని వేదాంత శాస్త్ర రహస్వార్ధములను ధారపోసిరి.


శ్రీ స్వారాజ్య ఆశ్రమ వ్యవస్థాపకులైన బ్రహ్మశ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యులు (1900 - 1975)


వేదాంతం లక్ష్మణార్యులు ఆంధ్ర రాష్ట్రంలోని ఎందరో మహాత్ములకు నిలయమైన రాయలసీమలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం అను గ్రామమున 1900 సం||లో జన్మించిరి. పద్మశాలీ వంశస్థులైన శ్రీమతి రామక్క శ్రీ తిరువేంగళప్ప అను పుణ్య దంపతులకు వీరు ద్వితీయ పుత్రులు.

తన సోదరుడైన పొడరాళ్ళ రామస్వామిగారి నుండి పురాణ కథనమున వేదాంతాంశ్యములను గమనించి నేర్చుకున్నారు.

తదుపరి కొంతకాలం విధ్యాభోదక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి భారత, భాగవత, రామాయణములకు విశేషముగా అర్థముల వివరించుచు శ్రోతలను ఆనందింప చేసెడివారు

రాయదుర్గం తాలూక గొల్లపల్లి గ్రామంలో ఒకపరి శివరాత్రి సందర్భంగా బ్రహ్మశ్రీ యాదాటి నరహరి గురుదేవుల భోదామ్రుతమును గ్రోలి

శాస్త్రములకును, నరహరి గురువుల భోధకును గల తారతమ్యమును గుర్తించి వారి ప్రియ శిష్యులై వేదాంత రహస్యార్ధ విచారణలో పండితులై జ్ఞాన సిద్దినొందిరి. మహాత్ములు జీవించి యున్నప్పుడే వారినుండి బ్రహ్మవిద్య

రహస్యములను సంపూర్ణముగా గ్రహించుటే శిష్య కర్తవ్యము అని భావించిరి. దైవ సన్నిభుడైన ఒక మహాత్మునిచే అమనస్కయోగము (బ్రహ్మనిష్టారహస్యము) ను పొంది సోహంభావ ధ్యాన నిష్టయే ప్రధమ సోపానమని ముముక్షులోకానికి చాటిరి.

తాడిపత్రి పట్టణమందు పినాకిని తీరంలో 1945, 46, 47 మూడు సం||లు (సహస్ర సూర్యోదయములు) మౌనదీక్షలో తపమాచరించిరి.


బ్రహ్మ శ్రీ అవ్వారు అన్నయ్య తీర్థులు స్వామి

పూజ్య గురువులు శ్రీ బ్రహ్మశ్రీ అవ్వారు అన్నయ్య తీర్థులు స్వామి తొండలదిన్నే అను ఒక చిన్న గ్రామమున 2-2-1911 తేదీన జన్మించిరి. తల్లి అశ్వర్థమ్మ, తండ్రి కొండయ్య గారికి స్వామి ద్వితీయ సంతానం, వివాహ అనంతరం ప్రొద్దుటూరు నందు నివాసము ఉండెడివారు. పద్మశాలీయులు కావున మగ్గము నేయుచు జీవితం సాగించేవారు. ఒక రోజున బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణార్యుల బోధలు విని అందు విశ్వాసక్తి కలిగి వారి వద్ద శిష్యులుగా చేరి ఆత్మజ్ఞానము నందు అపార అనుభవం పొంది స్వామి వారి ప్రియ శిష్యులు అయినారు. తరువాత అయన కొంత కాలమునకు గురువుగా అనుభవం పొంది అనేక రాష్ట్రములలో శ్రీ వేదాంత స్వారాజ్య ఆశ్రమములు నెలకొలిపి నల్లఓబుల వారి పల్లె, చిన్న గొట్టిగిల్లు మండలం, పీలేరు తాలూకా యందు స్థిర ఆశ్రమము నెలకొలిపిరి, అక్కడే బోధనలు చేయుచుండిరి. స్వామివారు 9-3-2005 న పరమ పదమును పొందిరి.


బ్రహ్మశ్రీ రామ చైతన్య స్వామి

పూజ్య గురువు శ్రీ బ్రహ్మశ్రీ రామచైతన్య స్వామి


బ్రహ్మశ్రీ అల్లి నరసయ్య పంతులు స్వామి

పూజ్యులు శ్రీ బ్రహ్మశ్రీ అల్లి నరసయ్య పంతులు స్వామి సోలాపూర్, వీరు 4-3-1943 లో జన్మించిరి. వీరు అన్నయ్య తీర్థుల స్వామి వారి బోధనలు విని అందు ఆసక్తి కలిగి స్వామి వారికి శిష్యులు అయినారు. తర్వాత బ్రహ్మ విద్య యందు అనుభవం పొంది గురువులుగా మారి పలువురిని శిష్యులుగా చేసుకొని వారికి ఆత్మజ్ఞాన బోధలు చేయుచున్నారు. వీరు చిన్న వయసు నుండి పౌరోహితము చేయుచు యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు.