వేదాంతం లక్ష్మణార్యులు ఆంధ్ర రాష్ట్రంలోని ఎందరో మహాత్ములకు నిలయమైన రాయలసీమలోని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం అను గ్రామమున 1900 సం||లో జన్మించిరి. పద్మశాలీ వంశస్థులైన శ్రీమతి రామక్క శ్రీ తిరువేంగళప్ప అను పుణ్య దంపతులకు వీరు ద్వితీయ పుత్రులు.
తన సోదరుడైన పొడరాళ్ళ రామస్వామిగారి నుండి పురాణ కథనమున వేదాంతాంశ్యములను గమనించి నేర్చుకున్నారు.
తదుపరి కొంతకాలం విధ్యాభోదక ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి భారత, భాగవత, రామాయణములకు విశేషముగా అర్థముల వివరించుచు శ్రోతలను ఆనందింప చేసెడివారు
రాయదుర్గం తాలూక గొల్లపల్లి గ్రామంలో ఒకపరి శివరాత్రి సందర్భంగా బ్రహ్మశ్రీ యాదాటి నరహరి గురుదేవుల భోదామ్రుతమును గ్రోలి
శాస్త్రములకును, నరహరి గురువుల భోధకును గల తారతమ్యమును గుర్తించి వారి ప్రియ శిష్యులై వేదాంత రహస్యార్ధ విచారణలో పండితులై జ్ఞాన సిద్దినొందిరి. మహాత్ములు జీవించి యున్నప్పుడే వారినుండి బ్రహ్మవిద్య
రహస్యములను సంపూర్ణముగా గ్రహించుటే శిష్య కర్తవ్యము అని భావించిరి. దైవ సన్నిభుడైన ఒక మహాత్మునిచే అమనస్కయోగము (బ్రహ్మనిష్టారహస్యము) ను పొంది సోహంభావ ధ్యాన నిష్టయే ప్రధమ సోపానమని ముముక్షులోకానికి చాటిరి.
తాడిపత్రి పట్టణమందు పినాకిని తీరంలో 1945, 46, 47 మూడు సం||లు (సహస్ర సూర్యోదయములు) మౌనదీక్షలో తపమాచరించిరి.
పూజ్య గురువులు శ్రీ బ్రహ్మశ్రీ అవ్వారు అన్నయ్య తీర్థులు స్వామి తొండలదిన్నే అను ఒక చిన్న గ్రామమున 2-2-1911 తేదీన జన్మించిరి. తల్లి అశ్వర్థమ్మ, తండ్రి కొండయ్య గారికి స్వామి ద్వితీయ సంతానం, వివాహ అనంతరం ప్రొద్దుటూరు నందు నివాసము ఉండెడివారు. పద్మశాలీయులు కావున మగ్గము నేయుచు జీవితం సాగించేవారు. ఒక రోజున బ్రహ్మశ్రీ వేదాంతం లక్ష్మణార్యుల బోధలు విని అందు విశ్వాసక్తి కలిగి వారి వద్ద శిష్యులుగా చేరి ఆత్మజ్ఞానము నందు అపార అనుభవం పొంది స్వామి వారి ప్రియ శిష్యులు అయినారు. తరువాత అయన కొంత కాలమునకు గురువుగా అనుభవం పొంది అనేక రాష్ట్రములలో శ్రీ వేదాంత స్వారాజ్య ఆశ్రమములు నెలకొలిపి నల్లఓబుల వారి పల్లె, చిన్న గొట్టిగిల్లు మండలం, పీలేరు తాలూకా యందు స్థిర ఆశ్రమము నెలకొలిపిరి, అక్కడే బోధనలు చేయుచుండిరి. స్వామివారు 9-3-2005 న పరమ పదమును పొందిరి.
పూజ్య గురువు శ్రీ బ్రహ్మశ్రీ రామచైతన్య స్వామి
పూజ్యులు శ్రీ బ్రహ్మశ్రీ అల్లి నరసయ్య పంతులు స్వామి సోలాపూర్, వీరు 4-3-1943 లో జన్మించిరి. వీరు అన్నయ్య తీర్థుల స్వామి వారి బోధనలు విని అందు ఆసక్తి కలిగి స్వామి వారికి శిష్యులు అయినారు. తర్వాత బ్రహ్మ విద్య యందు అనుభవం పొంది గురువులుగా మారి పలువురిని శిష్యులుగా చేసుకొని వారికి ఆత్మజ్ఞాన బోధలు చేయుచున్నారు. వీరు చిన్న వయసు నుండి పౌరోహితము చేయుచు యజ్ఞ యాగాదులు నిర్వహించేవారు.