పూజ్య గురుదేవుల ఆశయము

పరమపూజ్యులు శ్రీ జగద్గురు వేదాంతం లక్ష్మణార్యుల ప్రధానమైన ఆలోచన, ఆశయము - సర్వమానవులు వసుధైక కుటుంబముగా జీవించాలి, అందరూ సోదర భావముతో సామరస్య భావము గలిగి ఉండాలి, ప్రస్థానత్రయ ప్రభోదములు లోకమునందంతట ప్రచారము కాగలిగినచో అందరు వాస్తవమును గ్రహించి సర్వాత్మనాభావముతో సుఖశాంతులతో జీవించగలరు. భారతీయ సంస్కృతియగు ఆధ్యాత్మిక సౌధానికి మూల స్తంభములు ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రములు, భగవద్గీత, ప్రకరణ గ్రంథములు. ఇవి అన్నీయూ సమాజము నందంతట ప్రచారము గావింపబడినచో అందరునూ వాస్తవమునెఱిగి, సత్యమార్గమునందు పయనించి, కులమతాల కతీతులై కలిసికట్టుగా జీవించగలరు అనేది స్వామివారి ఆశయము.

1959 సం||లో తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ పట్టమునందు వేదపరిషత్తు జరిగెను. ఆసభలకు కాశీనుండి మరియు వివిధ ప్రాంతముల నుండి వేదవేత్తలైన పండితులు రావటం జరిగినది. ఆ సభలో వేదములు, ఉపనిషత్తుల యందలి అనేక అంశములపై సత్యపరిశీలన చేయటం జరిగినది. వాటిలో తైత్తిరీయోపనిషత్తు నారాయణ ప్రశ్నమునందలి గాయత్రీ మంత్రములపై వేదవేత్తలకు స్వామివారికి విచారణ జరిగినది. గాయత్రీదేవి అనగానేమి? గాయత్రీదేవికి పంచశిరస్సులు, ఆఱు ఉదరములు, మూడు పాదములు మొదలగు అంతరార్థ సహితము, నిగూఢమైన ఆధ్యాత్మిక అంశములతో కూడియున్న గాయత్రీ స్వరూప స్వభాపములపై సుదీర్ఘమ్తెన వాదోపవాదనలు సలిపిన అనంతరము పండితులు స్వామివారు అందించిన గాయత్రీ మంత్రమునకు సహేతుకమును, సశాస్త్రీయమైన వివరణలకు ముగ్ధులై స్వామివారి బోధనా పఠిమకు, వ్యాఖ్యానమునకు అందరూ ఆనందించి స్వామివారికి భక్తిపూర్వకముగా ప్రణతులు గావించిరి. అనంతరము పట్టణ పుర ప్రజల అభ్యర్థన మేరకు స్వామివారు గాయత్రీ మహా మంత్రములపై 40 రోజులు అత్యద్భుతమైన ప్రవచనమును అందించగా భక్తలోకమంతా ముగ్ధులై స్వామివారికి ఘన సన్మానము చేసిరి. నవరత్న ఖచితమైన ఆదిశేషుని చిహ్నముతో కుడిన కిరీటము, గండపెండేరమును, కుండలములు, భుజకీర్తులు, ఓంకార పతకము స్వర్ణాభరణములతో స్వామివారిని సత్కరించి, పూలాభిషేకము గావించి, గజారోహణమున పురవీధులలో ఊరేగించి కాకినాడ పట్టణ ప్రజలందరూ ఆశ్చర్యపడురీతిగా కన్నుల పండుగగా స్వామివారిని సన్మానించిరి.

స్వామివారు దేశమునందంతట సంచరించి అసంఖ్యాకమైన శిష్యలోకానికి సోహంభావ ధ్యాన సూత్రమునుపదేశించిరి. మరియు భారత భాగవత రామాయణాది గ్రంథములకు అంతరార్థ సహితముగ అర్థవివరము నందించి ప్రస్థానత్రయములగు ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీతకు భాష్యము రచించి మరియు సామాన్య జనులకు అర్థమగు రీతిలో స్వీయరచనలను అందించిరి.

శ్రీ స్వారాజ్య ఆశ్రమము అనే నామముతో కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణము నందు ఆశ్రమమును స్థాపించి, నిరంతరముగా భక్తులకు ప్రబోధములనందించుచూ అనేక ప్రాంతములలో సత్సంగములను నిర్వహించేలాగున ప్రబోధకులుగా తయారు చేసినదే కాకుండ దేశమంతట జ్ఞానభోదనలు వ్యాప్తి చేయుటకుగాను సద్గురువులగు శ్రీ జి. యన్. శాస్త్రి స్వామి వారిని, శ్రీ అవ్వారు అన్నయ్య తీర్థ స్వామివారిని, శ్రీ లక్ష్మణ స్వామివారిని, శ్రీ పూర్ణానంద స్వామివారిని, ప్రధాన ప్రబోధకులుగా తీర్చిదిద్ధిరి. అనేక ప్రాంతములలో భక్తుల ఆహ్వానము మేరకు వేద సదస్సులను నిర్వహించి జ్ఞాన ప్రబోధములను భక్తలోకానికి అందించి తరింపజేసిన మహనీయమూర్తి శ్రీ జగద్గురువు వేదాంతం లక్ష్మణార్యులు.

శ్రీ జగద్గురువు వేదాంతం లక్ష్మణార్యులు, శ్రీ స్వారాజ్య ఆశ్రమము, ప్రొద్దుటూరు, కడప జిల్లా.